పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఈ సారి ఆయన భారత్ లో మైనారిటీల పట్ల అక్కడి ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ విరుచుకుపడ్డారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో, వారి హక్కులను ఎలా పరిరక్షించాలో పాకిస్థాన్ ను చూసి మోడీ సర్కార్ నేర్చుకోవాలన్నారు. తమ దేశంలో మైనారిటీలకు ఎలాంటి భయం లేదనీ, వారు దేశ అభివృద్ధిలో భాగస్వాములౌతున్నారనీ పేర్కొన్నారు. లోహార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై భారత్ లో జరుగుతున్న దుమారంపై మాట్లాడారు.
దేశంలో పరిస్థితులపై నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను అక్కడి అధికార బీజేపీ తప్పుపట్టడాన్ని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. నసీరుద్దీన్ షా పాకిస్థాన్ కు వెళ్లిపోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేయడాన్ని ఆయన ఖండించారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో పాకిస్థాన్ ను చూపి వారు నేర్చుకోవాలని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి పాకిస్థాన్ ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఉన్న మైనారిటీల రక్షణ విషయంలో రాజీ పడబోమని చెప్పి, మా దేశాన్ని చూసి మోడీ సర్కార్ నేర్చుకోవాలని పేర్కొన్నారు.