హిందీ బెల్ట్ రాష్ట్రాలు ముడింటిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలయ్యాయి. వాటిస్థానంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎంగా భేపేష్ బఘేలులు నేడు ప్రమాణ స్వాకారం చేయనున్నారు. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గైర్హాజరు అవుతున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమత, మాయా గైర్హాజర్ కావడం ఆ ప్రయత్నాలకు ఒకింత ఆటంకంగా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క స్థానం వెనుకబడిన కాంగ్రెస్ కు మాయావతి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె గెర్హాజర్ కావడం బీజేపీయేతర ఫ్రంట్ పట్ల ఆమె సానుకూలంగా లేరా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే విధంగా మమత బెనర్జీ కూడా గైర్హాజరు కానున్నట్లు పేర్కొనడంతో జాతీయ స్థాయిలో కూటమి విషయంలో ఆమె సానుకూలత పట్ల కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ కు వీరిరువురూ సుముఖంగా లేరన్న వార్తలు వినవస్తున్నాయి.