అనంతపురం, డిసెంబర్ 26: నూతన ఆవిష్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం, ఇది చూసి ప్రధాని మోదీ, ఇటు పక్క జగన్ మరి కొందరు ఒర్వలేక పోతున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురంలో జరిగిన ధర్మపోరాట సభలో చంద్రబాబు మాట్లాడుతూ నేడు గ్రామాలు కళకళ లాడుతున్నాయి, గ్రామాలకు ఎల్ఇడీ బల్పులు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరికీ దూరదృష్టి ఉండాలి, నూతన విధానంతో పనులు చేసి మేరుగైన ఫలితాలు సాధించాలి, హుద్ హుద్ వచ్చింది, సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, రాజధాని అమరావాతి కట్టేవాళ్లం కాదు, రైతులకు పిలుపు ఇవ్వడంతో నాపై నమ్మకంతో 33వేల ఎకరాలు స్వచ్చందంగా భూమి ఇచ్చారు. 50వేల కోట్లు ఖర్చు పెట్టి ఇండియాలో ఎక్కడా లేనటువంటి సిటీ నిర్మించుకుంటున్నాం, ప్రపంచంలో ఇంత సుందరమైన సెక్రటియేట్ ఎక్కడా ఉండదన్నారు. ప్రజారాజధాని అమరవాతిలో బయట నుండి వచ్చి ఉండే వారికి కూడా అవకాశం కల్పిస్తాం, 50వేల సుందరమైన ఇళ్లు కట్టి ఇస్తాం, అది పెద్ద ఇన్నోవేషన్ అన్నారు. అదే వారందరికీ నా మీద బాధ. మన ముందు చూపుతో రాజధానికి భారీగా ఆదాయం వస్తుంది. బెంగళూరు వల్ల కర్నాటకకు, చెన్నై వల్ల తమిళనాడుకు పేరు వచ్చిన విధంగానే అమరావతి వల్ల ఆంద్రఫ్రదేశ్కు మంచి పేరు వస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు ఇస్తాం, రైతులు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా సోలార్ పంపు సెట్లు ఇస్తాం, వారు మిగిలిన కరెంటు గ్రిక్ కు ఇవ్వవచ్చన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది మే నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తాం. కేంద్రం సహకరించకున్నా పోలవరాన్ని పూర్తి చేసి తీరతాం. బీజేపీని, ఆ పార్టీకి వంత పాడే పార్టీలను చిత్తుగా ఓడించాలి. వైసీపీ అవినీతి పార్టీ, బీజేపీకి వైసీపీ సహకరిస్తోంది. అవినీతి పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. ఒడిశా ఒప్పుకున్నా కేంద్రం విశాఖకు రైల్వేజోన్ ఇవ్వడం లేదు. కడప స్టీల్ ప్లాంట్కు రేపు శంకుస్థాపన చేస్తాం. కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత మాదే. దుగరాజుపట్నం పోర్టు, పెట్రో కెమికల్ వర్సిటీ ఇస్తామని మోసం చేశారు. విశాఖ, విజయవాడకు మెట్రోరైల్ ఇవ్వడంలేదు అని చంద్రబాబు అన్నారు.