ఢిల్లీ: మోది బయోపిక్ నిర్మాతలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సినిమా విడుదలపై ఎన్నికల కమిషన్ ఆకాంక్షలు విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ చిత్రం ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్తో సహా వామపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
దీంతో ఎన్నికల సంఘం ‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్లను ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయొద్దని ఈ నెల 10వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వములోని ధర్మాసనం పూర్తి చిత్రాన్ని వీక్షించి ఎన్నికల వియమావళి ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తెలియజేయాలనీ, నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలనీ ఈ నెల 15న తేదీన ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ప్రతులను చిత్ర నిర్మాతలకు కూడా అందజేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 26న ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఎన్నికల కమిషన్ తమ నివేదిక సీల్డ్ కవర్లో అందించింది. మోది బయోపిక్ ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేదిగా ఉందని నివేదికలో పేర్కొంది. ఈ సినిమాను వచ్చే నెల 19 వరకు అంటే చివరి దశ ఎన్నికల జరిగేవరకు విడుదల చేయొద్దని ఎన్నికల కమిషన్ తెలిపింది.
దీనిపై శుక్రవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల కమిషన్ నిర్ణయం సబబేనని తెలిపింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంలో తాము కల్పించుకోమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
మోదీ బయోపిక్లో నరేంద్ర మోదీగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల ఐదున విడుదల చేయాలని నిర్మాతలు భావించగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.