కొద్ది సేపు వాయిదా తరువాత ప్రారంభమైన లోక్ సభ వెంటనే మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇక్కడ కూడా విపక్ష సభ్యులు ప్లకార్టులు ప్రదర్శిస్తూ వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. గత సమావేశాలు కూడా పూర్తిగా గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదాల పర్వంలో సాగిన సంగతి తెలిసిందే. ఈ సారి శీతాకాల సమావేశాలు కూడా రాఫెల్, సీబీఐ, ఆర్బీఐ అంశాలపై విపక్షాల నిరసనలతో దద్దరిల్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో విజయం సాధించడంతో ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తున్నది. దీంతో లోక్ సభలో కూడా ఆ పార్టీ సభ్యులు తమ గళాన్ని గట్టిగా వినిపించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం డిఫెన్స్ లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సమావేశాలు కూడా వాయిదాల పర్వంతోనే సాగుతాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.