కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లలో తప్పుడు వివరాలు ఇస్తే వారిపై అనర్హత వేటు వేసే దిశగా ఈసీ చర్యలు చేపట్టింది.
మండలి ఎన్నికలలో అభ్యర్థుల వ్యయంపై పరిమితి విధించే దిశగా దృష్టి సారించింది. సంస్కరణలపై లెజిస్లేచర్ కార్యదర్శి నారాయణ రాజుతో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు చర్చలు జరపనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం ఈ భేటీ ఉండే అవకాశం ఉంది. అలాగే నేరచరిత్ర ఉన్న అభ్యర్థుల పోటీ అనర్హత, అభ్యర్థుల ఆస్తుల ప్రకటన తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.ఓటర్ల జాబితాలో అవకతవకలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై కూడా ఈసీ దృష్టి సారించింది.