రోజుకొక్కశాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ రోజు సహజవనరులు- సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నీటి వనరులపై శ్రద్ధ పెట్టిందని పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరవును తరిమికొడతామని చెప్పారు. కృష్ణా- గోదావరి అనుసంధానం చేశామని, త్వరలో గోదావరి- పెన్నా నదులను అనుసంధానిస్తామని చెప్పారు. ఆ తరువాత అన్ని నదులనూ అనుసంధానిస్తామని చంద్రబాబు చెప్పారు. నాగావళి-వంశధార నదులను అనుసంధానించి ఉత్తరాంధ్రకు నీటి కొరత లేకుండా చేస్తామన్నారు.
వరుసగా ఒక్కో రంగంపై రోజుకో శ్వేత పత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు ఆ వరుసలో ఈ రోజు సాగునీటి రంగంపై విడుదల చేసిన శ్వేత పత్రం ఐదోది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువచ్చి కాలుష్యాన్ని తగ్గిస్తామన్నారు. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టిసీమ ద్వారా 97 టీఎంసీల నీరు తెచ్చామన్నారు. ఇరిగేషన్ శాఖకు ఎన్నో అవార్డులు వచ్చాయని.. ఏడాదిలోగా పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రం నుంచి కరవును తరిమికొడతామని చంద్రబాబు అన్నారు.