ప్రస్తుత తరుణంలో జనాలు ఎక్కువగా న్యూమరాలజీకి ప్రాధాన్యతను ఇస్తున్నారు. తమ లక్కీ నంబర్లు తమ వాహనాల నంబర్లలో వచ్చేలా చూసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల ఆర్టీవోలకు కేవలం ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయడం ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వస్తోంది. ఇక ఢిల్లీ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. అందులోనూ కరోనా ఉన్న ఈ సమయంలోనూ వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల పట్ల అధిక ఆసక్తిని కనబరుస్తుండడం విశేషం.
ఢిల్లీలో జూలై నెలలో కార్లు, టూవీలర్ల ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించగా అక్కడి రవాణా శాఖకు ఏకంగా రూ.33.8 లక్షల ఆదాయం వచ్చింది. వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు గాను ఈ-ఆక్షన్ నిర్వహించారు. అందులో 0009 అనే కార్ ఫ్యాన్సీ నంబర్కు ఏకంగా రూ.7.1 లక్షల భారీ ధర పలికింది. ఆ మొత్తాన్ని ఓ వాహనదారుడు ఈ-వేలంలో చెల్లించి ఆ నంబర్ను సొంతం చేసుకున్నాడు. ఇక 0005, 0007, 1111 నంబర్లకు కూడా భారీ ధరలు వచ్చాయి. ఆయా నంబర్లను వేలంలో రూ.3.1 లక్షల నుంచి రూ.4.2 లక్షల వరకు చెల్లించి సొంతం చేసుకున్నారు.
ఇక టూవీలర్ల ఫ్యాన్సీ నంబర్ల వేలంలో 0006 అనే నంబర్కు ఓ వాహనదారుడు ఏకంగా రూ.50వేలు చెల్లించాడు. కాగా 9000 అనే ఫ్యాన్సీ నంబర్కు ఏప్రిల్ నెలలో ఓ వాహనదారుడు రూ.1.5 లక్షలు చెల్లించాడు. మే నెలలో ఫ్యాన్సీ నంబర్ల వేలానికి ఢిల్లీ రవాణా శాఖ రూ.9.3 లక్షలను ఆర్జించింది. ఆ నెలలో 0022 అనే నంబర్కు రూ.2.1 లక్షలు వచ్చాయి. జూన్లో ఆ ఆదాయం రూ.21.7 లక్షలుగా ఉంది. ఆ నెలలో 0002 అనే నంబర్కు రూ.3.4 లక్షలు వచ్చాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలల మధ్యలో వాహనాల ఫ్యాన్సీ నంబర్ల వేలం నేపథ్యంలో ఢిల్లీ రవాణాశాఖకు రూ.66.3 లక్షల ఆదాయం వచ్చింది. అవును మరి.. ఫ్యాన్సీ నంబర్లా.. మజాకా..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?