కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. కోలుకునేందుకు చాలా నెలలు పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే దేశంలో కరోనా లాక్డౌన్ ఆరంభమైన నాటి నుంచి.. అంటే దాదాపుగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1.89 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇక కేవలం జూలై నెలలోనే 50 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది.
కాగా జూన్ నెలలో 39 లక్షల మంది దేశంలో ఉద్యోగాలను మళ్లీ పొందారు. ఏప్రిల్ నెలలోనే 1.77 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోగా.. మే నెలలో 1 లక్ష మంది ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు దేశంలో ఉద్యోగాలను కోల్పోయిన వారి సంఖ్య 1.89 కోట్లకు చేరుకుంది. ఇక ఈ సంఖ్య ఇంకా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.
2019-20 మధ్య కాలంలో 1.90 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. అందులో ఎక్కువ శాతం ఇటీవలి కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన వారే ఉన్నారు. అలాగే మరో 68 లక్షల మంది దినసరి కార్మికులు ఉపాధి కోల్పోయారు. కానీ.. ఇదే సమయంలో 1.49 కోట్ల మంది కొత్తగా వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. కాగా లాక్డౌన్ను ప్రకటించగానే దేశంలోని అనేక కంపెనీలు, పరిశ్రమలు చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి. కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ఇప్పటికీ అనేక మంది ఉద్యోగాలను కోల్పోతూనే ఉన్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాక మళ్లీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.