కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా ఎలా సర్వనాశనమైందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ దేశం.. ఈ దేశం అనే కాకుండా.. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి వల్ల ఎన్నో సమస్యలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఇఫ్పుడిప్పుడే జనాలు కాస్త బయటికి వెళ్తున్నారు. తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారు.
నిజానికి కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనప్పటికీ.. చేసేది లేక బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పటికే గత ఆరేడు నెలల నుంచి రూపాయి సంపాదన లేక బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడిపారు ప్రజలు. దీంతో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంకా ఇలాగే ఉంటే భవిష్యత్తులో పూట కూడా గడిచే పరిస్థితి ఉండదని… కరోనా వ్యాప్తి ఉన్నా.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ బయటికి వెళ్తున్నారు.
అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా మహమ్మారి గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో పది శాతం జనాభాకు ఇప్పటికే కరోనా సోకిందట. కొందరికి తెలిసి ఉండవచ్చు.. కొందరికి తెలియకపోవచ్చు కానీ.. పది మందిలో ఒకరు కరోనాతో పోరాడారు.
అయితే.. ఇక్కడ టెస్టులు చేయించుకుంటున్నవాళ్లకే కరోనా సంగతి బయటపడుతోంది. టెస్టులు చేయించుకోని వాళ్లు కోట్లలో ఉన్నారు. వాళ్లలోనూ కరోనా ఉండొచ్చు.. కానీ వాళ్లలో ఉండే రోగనిరోధక శక్తి వల్ల అది బయటపడటం లేదు.. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
అంటే.. ఒక పది మంది గ్రూప్ ను తీసుకుంటే అందులో ఖచ్చితంగా ఒకరికి కరోనా సోకిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. ప్రాంతాలను బట్టి కరోనా వైరస్ ప్రభావం మారుతోందని చెబుతున్నారు.