జమ్ము కశ్మీర్ లోని పుంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సావ్జియాన్ నుండి మండి వైపుకు వెళుతున్న మినీ బస్సు బరేలి నల్లా సమీపంలో లోయలో పడిపోయింది. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 11 మంది మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మండిలోని ఆసుపత్రికి తరలించినట్లు తహశీల్దార్ షెహజాద్ లతీఫ్ తెలిపారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై జమ్ము కశ్మీర్ లెప్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మినీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్ లెప్ట్ నెంట్ గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎల్ జీ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎల్ జీ మనోజ్ సిన్హా.
రెండు లక్షలు పరిహారం ప్రకటించిన పీఎం మోడీ
జమ్ము కశ్మీర్ లో జరిగిన మినీ బస్సు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన పీఎం మోడీ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అదే విధంగా బాధితులకు రూ.50వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.