న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 112ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం ప్రారంభించింది. పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్యం, మహిళా హెల్ప్లైన్లు లాంటి అత్యవసర సేవలకు ఇప్పటివరకు వేర్వేరు నెంబర్లు ఉండేవి.
వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ రూపొందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(సీఆర్ఎస్ఎస్)ను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. వచ్చే ఏడాది నాటికి దేశ వ్యాప్తంగా ఈ నెంబర్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
కాగా, కొత్తగా రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సేవలను 112కు డయల్ చేయడంతోపాటు ఇతర విధానాల్లోనూ కూడా పొందవచ్చు. స్మార్ట్ఫోన్లో ‘పవర్ బటన్’ను మూడు సార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్మ్లైన్కు సమాచారం అందుతుంది. ఇక సాధారణ ఫోన్లలో 5 లేదా 9 అంకెను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు.
దేశంలోని సేఫ్ సిటీ ప్రాజెక్టుల అమలుకు హైదరాబాద్ సహా 8 ప్రాంతాలను గుర్తించినట్లు హోంమంత్రి రాజ్నాథ్ తెలిపారు. దీని కోసం నిర్భయ పథకం కింద తొలి విడతగా రూ.2,919 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, లక్నో, కోల్కతా లాంటి మెట్రో నగరాల్లో మహిళా భద్రతకు ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు పర్యవేక్షణకు ప్రత్యేక పోర్టల్ను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?