పిల్లి సుభాష్ చంద్రబోస్ ,మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఖాళీ అయిన ఆ రెండు మంత్రి పదవులను త్వరలో భర్తీ చేసే ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ఆశావహుల హడావుడి అంతా ఇంతా కాకుండా ఉంది.ముఖ్యంగా పధ్నాలుగు మంది వైసిపి ఎమ్మెల్యేలున్న అనంతపురం జిల్లాలో ఎవరికి వారే ఈ మంత్రి పదవిని అందుకోవడానికి ఆరాటపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు.. రాజ్యసభకు ఎంపిక కావడంతో వారి కేబినెట్ బెర్తులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వైకాపాలో మళ్లీ మంత్రిపదవుల హడావిడి మొదలైపోయింది. జగన్ దృష్టిలో తామున్నామో లేదో అనే టెన్షన్ లో చాలా మంది నేతలు, మరి ముఖ్యంగా బలమైన ఆశావహులు తెగ టెన్షన్ పడిపోతున్నారంట. తమకు ఎలాగూ ఇప్పట్లో రాదని క్లారిటీతో ఉన్నవారు బాగానే ఉన్నారు కానీ.. తమకు అర్హత ఉంది అని ఫీలవుతున్నవారు మాత్రం కంటిమీద కునుకు లేకుండా ఆలోచిస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో జిల్లాకు రెండేసి కేబినెట్ పోస్టులు వచ్చిన ప్రాంతంలోని నేతలు పెద్దగా ఆసక్తి చూపకున్నా ఒక్కొక్క మంత్రి పదవిని మాత్రమే పొందిన శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలలోని నేతలు మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్ పదవి, కడప జిల్లాకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు ఉండటంతో వారు కూడా గమ్మునున్నారు.కానీ 14 సీట్లు గల అనంతపురం జిల్లా నేతలు మాత్రం జిల్లాకు రెండో మంత్రి పదవి తెచ్చుకుందామని తెగ ఆరాటపడుతునారు
ఆ జిల్లాలో అత్యంత సీనియర్ గా ఉన్న అనంత వెంకట్రామిరెడ్డితో పాటు, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు యమ ఆశతో ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో తాము ఫ్రెష్ అయినా కూడా లక్కీగా ఛాన్స్ దొరుకుతుందేమో అని ప్రకాశ్ రెడ్డి, పద్మావతిలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.వారి ప్రయత్నాలు ఎలాగా ఉన్నప్పటికీ జగను కి మాత్రం ఇది ఒక పరీక్షేనని చెబుతున్నారు.కర్ర విరక్కుండా పాము చావకుండా ఎలాగ ఈ పరిస్థితిని సీఎం అధిగమిస్తారో చూడాలి