ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నా చోరీలకు పాల్పడే దుండగులు మాత్రం తగ్గడం లేదు. రోజుకో రకంగా చోరీలు చేస్తూనే వస్తున్నారు. ఇలా ఇంకో రకమైన చోరీ తమిళనాడు లో జరిగింది.
సెల్ ఫోన్ల లోడ్ తో వెళ్తున్న లారీని అడ్డగించిన దుండగులు అందులోని ఫోన్లను చోరీ చేశారు. తమిళనాడులోని ఒక కంపనీ మొబైల్ ప్లాంట్ నుంచి లారీలో 14,400 ఫోన్లను ముంబాయికి తరలించాలని అనుకున్నారు. వీటి విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుంది. లోడ్ అయిన లారీలో ఫోన్లను ముంబయికి తరలిస్తుండగా మార్గ మధ్యలో కొందరు దుండగులు మరో లారీతో అడ్డగించారు.
ఫోన్లు ఉన్న లారీలోని డ్రైవర్ ను, క్లీనర్ లను కాళ్లు, చేతులను తాడుతో కట్టేశారు. తర్వాత లోడ్ ఉన్న లారీ లోని ఫోన్ బాక్సులను వారి లారీ లోని ఎక్కించారు. తర్వాత డ్రైవర్, క్లీనర్ లను దగ్గర్లోని ఒక ముళ్లపొదల్లో పడేశారు. ఆ లారీని కూడా దుండగులు తీసుకుని వెళ్లారు. ఈ చోరీ చేసిన చోటుకు 8కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చిన లారీని వదిలేసి పరారయ్యారు.
ఈ చోరీ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు- బెంగళూరు హైవేపై 10 మంది కలిసి ఈ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ జరిగిన కొంతసేపటికి కాళ్లు, చేతులకు కట్టిన తాడులను విడిపించుకున్న డ్రైవర్, క్లీనర్ రోడ్డు మీదకు వచ్చారు. ఆ వైపుగా వెళ్తున్న 108 వెహికల్ లో వారిద్దరూ దగ్గర్లోని హాస్పెటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటూ పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్, క్లీనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీకి పాల్పడిన దుండగుల కోసం 17 బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.