పాకిస్థాన్, అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు పోలీస్ ప్రధాన కార్యాలయంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 18 మంది గాయపడ్డారు. మరోవైపు అమెరికాలో మరో సారి జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్లు కరాచీ పోలీస్ ప్రధాన కార్యాలయంపై కాల్పులకు దిగారు. పోలీసులు, సైన్యం ప్రతిఘటించడంతో అయిదుగురు తీవ్రవాదులు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పోలీసుల యూనిఫామ్ ధరించి పోలీస్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించినట్లు డీఐజీ ఇర్ఫాన్ తెలిపారు. ఉగ్రవాదులు తొలుత గ్రనెడ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ముగ్గురు తీవ్రవాదులు తమను తాము కాల్పుకుని చనిపోయినట్లు చెప్పారు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన విదేశీ క్రికెటర్ల హోటళ్లు కరాచీ పోలీస్ కార్యాలయానికి దగ్గరగా ఉండటంతో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.
మరో వైపు అమెరికాలోని మిసిసిప్పీ రాష్ట్రంలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటే కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్ (52) గా గుర్తించారు. అయితే రిచర్ డేల్ క్రమ్ మొదట తన మాజీ భార్య, ఇతర కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకు ముందు ఓ స్టోర్ లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతను ఎందుకు ఈ దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. అతన్ని విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.
Delhi Mayor Poll: సుప్రీం కోర్టులో ఆప్ కు బిగ్ రిలీఫ్ .. కీలక ఆదేశాలు జారీ