ఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వేకువజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, చిన్నారితో సహా 17మంది మృతి చెందారు.
అత్యంత రద్దీగా ఉండే కరోల్బాగ్ ప్రాంతంలో మూడు అంతస్తుల అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రమాదం జరిగిన వెంటనే కొందరు టెర్రస్ పై నుండి, భవనం కిటికీల నుండి కిందకు దూకారు. ఈ క్రమంలో చిన్నారితో సహా ఒక మహిళ మృతి చెందారు.
20కిపైగా ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.
మంటల్లో చిక్కుకుని ఊపిరి ఆడక 15మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 35మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే విషయం తెలియరాలేదు. పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.