కాల్ మనీ, కాల్ సెంటర్ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనాకు చెందిన ప్రధాన నిందితుడు లాంబోను పోలీసులు అరెస్టు చేశారు.బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చైనాకు పారిపోయేందుకు లాంబ్ యత్నించాడని పోలీసులు వెల్లడించారు. లాంబో..4 కంపెనీల ద్వారా లోన్ యాప్స్ నిర్వహిస్తున్నట్లు తేలింది. లాంబోకు సహకరించిన నాగరాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు కర్నూలు జిల్లాకు చెందిన వాడిగా నిర్ధారించారు. 6 నెలల్లో 150 యాప్స్ ద్వారా రూ. 21 వేల కోట్ల లావాదేవీలు జరిపాడు. పెద్దమొత్తంలో విదేశాలకు నిధుల మళ్లింపుపై సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.చైనా బ్యాచ్ మన డబ్బు మనకే అప్పుగా ఇస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. క్రికెట్ బెట్టింగ్ రూంలో డబ్బు దోచేస్తోంది అక్రమార్కుల ముఠా.
ఆ డబ్బునే చైనాకు తరలిస్తున్నాయి ముఠాలు. ఆన్లైన్ యాప్స్ ద్వారా ఆ డబ్బుని అప్పుగా ఇస్తున్నాయి. చైనా బెట్టింగ్ యాప్స్పై ఈడీ విచారణ జరుపుతోంది. ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఉప్పల్కు చెందిన బుమన్నా ప్రసాద్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పూణేలో జియా లియాంగ్ ఇన్ఫోటెక్ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరు 600 మందితో కంపెనీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 101 ల్యాప్టాప్లు, 106 సెల్ఫోన్లు, సీసీ కెమెరా డీవీడీ డ్రైవ్లు సీజ్ చేసినట్లు చెప్పారు.
ఆన్ లైన్ లోన్ యాప్ లపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. యాప్ లోన్ దారుణాలకు ఇప్పటికే పలువురు బలయ్యారు. మొత్తం 158 ఆన్ లైన్ లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ కు తెలంగాణ పోలీసుల లేఖ రాశారు. ఇంటర్నెట్ ప్రోటేకాల్ ద్వారా బాధితులకు టెలీ కాలర్ లు వేధింపులకు గురి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా లోన్ రూపంలో ఇస్తున్న 350 అకౌంట్లలో ఉన్న 87 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.