(న్యూడిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కరోనా పార్లమెంట్లోనూ కలకలాన్ని రేపింది. ఉభయ సభల్లో పాల్గొనే సభ్యులు అందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాలని పార్లమెంట్ అధికారుల ఆదేశాల నేపథ్యంలో లోక్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఏకంగా 25 మంది సభ్యులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది.
17మంది లోక్ సభ సభ్యులు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు కరోనా బారిన పడినట్లు వైద్యులు దృవీకరించారు. కరోనా బారిన పడిన లోక్ సభ సభ్యుల్లో అధికార బిజెపికి చెందిన వారు 12 మంది ఉండగా వైసీపీకి చెందిన ఇద్దరు, శివసేన, డిఎంకే, ఆర్ఎల్పి పార్టీలకు చెందిన ఒక్కొక్క ఎంపి ఉన్నారు.
కరోనా వ్యాధికి సంబంధించి ఎటువంటి లక్షణాలు లేని పలువురు పార్లమెంట్ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. కరోనా పాజిటివ్ రిపోర్టులు రావడంతో ఈ 25మంది వర్షకాల సమావేశాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.