OBC, EWS Reservation: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 -22 విద్యాసంవత్సరం నుండి మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ)లో ఒబీసీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండీవియా తెలిపారు. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్థులకు 27 శాతం, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు పది శాతం రిజర్వేషన్లు అందజేయనున్నారు.
ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండిఎస్, డిప్లొమో విద్యార్థులకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశానికి ఓ పరిష్కారం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ శాఖ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రతి ఏటా ఎంబీబీఎస్ లో దాదాపు 1500 ఓబీసీ, 550మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పీజీలో 2500 మంది ఓబీసీ, వెయ్యి మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు లబ్ది చేకూరనున్నది. వెనుకబడిన వర్గానికి ఈ డబ్ల్యుఎస్ వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం తమ మాటకు కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ ఇది ఓ లాండ్ మార్క్ నిర్ణయంగా అభివర్ణించారు. ప్రతి ఏటా వేలాది మంది యువత మంచి అవకాశాలు పొందడంలో, అలాగే సామాజిక న్యాయానికి కొత్త ఉదాహారణ సృష్టించడంలో ఇది ఎంతో సహాయపడుతుందని మోడీ పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యుఎస్ వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి గానూ 2019లో రాజ్యాంగ సవరణ జరిగింది.