ప్రస్తుతం కరోనా కొంచెం తగ్గుముఖం బాట పట్టినప్పటికీ.. జనాలు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కరోనా రికవరీ రేటు కూడా పెరిగింది. మృతుల సంఖ్య విపరీతంగా తగ్గింది.
అయితే.. గ్రామాల్లో వైరస్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఒక్కరి వల్ల వంద మందికి కరోనా అంటుకుంటోంది. కరోనా వచ్చిన వాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోకవపోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి.
తాజాగా గుంటూరు జిల్లాలో అదే జరిగింది. ఓ ట్యూషన్ సెంటర్ లో 30 మందికి ఒకేసారి కరోనా సోకింది. అదే గ్రామంలో 39 మందికి ఒక్కరోజులోనే కరోనా వ్యాప్తి చెందింది.
ఈ ఘటన జిల్లాలోని సత్తెనపల్లి మండలం భట్లూరులో చోటు చేసుకున్నది. ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న టీచర్ కు ముందు కరోనా రావడంతో వెంటనే ఆ ట్యూషన్ కు వెళ్లే విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా.. అందులో 14 మంది విద్యార్థులకు, ఆ విద్యార్థుల కారణంగా వాళ్ల తల్లిదండ్రులకు.. అలా మొత్తం 30 మందికి ఒకేసారి కరోనా సోకింది. కరోనా బారిన పడిన విద్యార్థుల్లో అందరూ 7 ఏళ్ల లోపు పిల్లలే. వెంటనే స్పందించిన అధికారులు గ్రామాన్ని కట్టడి చేసి అందరినీ హోం క్వారంటైన్ చేశారు.