జాతీయ రహాదారిపై కృష్ణాజిల్లా సరిహద్దు జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 30మందికిపైగా ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం చాలా పెద్దది అయినా భగవంతుడి దయతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.
విషయంలోకి వెళితే..విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళుతున్న సిరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై అనుమంచిపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది వరకూ ప్రయాణీకులు ఉండగా సుమారు 30మందికిపైగా ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన పలువురిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. క్షతగాత్రుల్లో విశాఖతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. స్వల్పంగా గాయపడిన పలువురు ఇతర వాహనాల్లో హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఒక పక్క పొగ మంచు, అతి వేగం, మరో పక్క డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు అంటున్నారు. డ్రైవర్ రెండు మూడు సార్లు నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు జర్క్ ఇచ్చిందనీ, దీంతో డ్రైవర్ను ప్రయాణీకులు హెచ్చరించారని ఒక క్షతగాత్రుడు మీడియాకు తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అందరూ క్షేమంగా బయటపడ్డారు అంటే భగవంతుడి దయేనని అంటున్నారు. ఘటనపై చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై ట్రావెల్స్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. డ్రైవర్ కూడా గాయపడటంతో డిశ్చార్జ్ అయిన తరువాత అతనిని పోలీసులు విచారించనున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ బస్సులో ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారు, వారి పేర్లు, వివరాలు, ఫోన్ నెంబర్ లు కూడా డ్రైవర్ వద్ద లేవని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.