ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా ఇది అతనికి భారీ షాక్ అనే చెప్పాలి. అతని పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి జంప్ అయిపోయారు. ముఖ్యమంత్రి ఉన్న పార్టీ నుండి ఎమ్మెల్యేలు పక్క పార్టీ లోకి వెళ్లి పోవడం అనేది చిన్న విషయం అయితే కాదు.
వివరాల్లోకి వెళితే, అరుణాచల్ ప్రదేశ్లోని జనతాదళ్-యునైటెడ్ (జెడియు) కు చెందిన ఆరుగురు శాసనసభ్యులు బిజెపికి మారారు. దీనితో జెడియు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యేతో మిగిలిపోయింది. ఇలా ఆ పార్టీనుంచి కొత్త శాసనసభ్యులను కొత్తగా చేర్చుకోవడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) బలం 48 కి పెరిగింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మొత్తం బలం 60. అరుణాచల్ ప్రదేశ్ లో తాజా మారిన పరిస్థితుల వల్ల బిజెపి, జెడియులలో విభేదాలు ఉన్నాయని పేర్కొన్న నివేదికలకు ఇంధనాన్ని చేకూర్చాయి. ఇక ఈ షాకింగ్ విషయం పై జెడియు ఇంకా స్పందించలేదు.
జెడియు పార్టీ నుండి బిజెపికి షిఫ్ట్ అయిపోయిన నాయకులు హయెంగ్ మంగ్ఫీ, జిక్కే టాకో, డోంగ్రూ సియాంగ్జు, తాలెం తబో, కంగ్గోంగ్ టాకు, మరియు డోర్జీ వాంగ్డి ఖర్మ లు కాగా వారు పార్టీ మారేందుకు గల కారణాలను ఇంకా తెలపాల్సి ఉంది. బీజార్లో బిజెపి, జెడియు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, అరుణాచల్ ప్రదేశ్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా జెడియు వారికి మద్దతు ఇస్తోంది.
జెడియు నాయకులు బిజెపిలో చేరిన తరువాత, సభలో ప్రతిపక్షాల బలం 12 కి తగ్గింది. కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీకి నలుగురు శాసనసభ్యులు ఉండగా, రాష్ట్రంలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. జెడియుకు మాత్రం ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలి ఉన్నారు.