పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏవైనా పథకాలను ప్రవేశపెడుతున్నాయంటే చాలు.. ప్రభుత్వ శాఖల్లో ఉండే కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఆ పథకాల ద్వారా డబ్బును ఎలా దోచేయాలా అని ఆలోచిస్తుంటారు. అందుకు కొత్త కొత్త ప్లాన్లు వేస్తుంటారు. అయితే అలాంటి వారి మోసాలు ఎన్నో రోజులు దాగవు. చివరకు వారు పట్టుబడే తీరుతారు. అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు కాజేస్తున్న తమను ఎవరూ పట్టుకోలేరనుకున్నారు. కానీ చివరకు దొరికిపోయారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే…
బీహార్లో ఆడ పిల్లల జననాల రేటును పెంచడం కోసం అక్కడి ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహకాలను అందజేస్తోంది. ఆడ పిల్ల పుడితే జన్మనిచ్చిన తల్లి బ్యాంక్ అకౌంట్లో రూ.1400 వేస్తున్నారు. అయితే దీన్ని అదునుగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు వివరాలను సమర్పించి ఆ డబ్బు నొక్కేయసాగారు. అందులో భాగంగానే అక్కడి ముజఫర్ పూర్ జిల్లా ముసహరి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల ఓ మహిళ 14 నెలల్లోనే ఏకంగా 8 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిందని, అలాగే మరో మహిళ 9 నెలల కాలంలో 5 మంది ఆడ పిల్లలను ప్రసవించిందని, ఇంకో మహిళ 5 నెలల్లో నలుగుర్ని కన్నదని.. ఉద్యోగులు తప్పుడు వివరాలు నమోదు చేశారు. అనంతరం ఆయా మహిళలకు ఒక్కో ఆడపిల్లకు రూ.1400 చొప్పున మొత్తం నగదును జమ చేసినట్లు రికార్డులు సృష్టించారు. ఆ తరువాత ఆ డబ్బును కాజేశారు.
అయితే 65 ఏళ్ల మహిళ అది కూడా 14 నెలల్లోనే 8 మందికి పిల్లలకు ఎలా జన్మనిస్తుందని ముసహరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జి ఉపేంద్ర చౌదరికి అనుమానం వచ్చింది. దీంతో రికార్డులను పరిశీలించగా.. ఇదొక పెద్ద స్కాం అని అర్థమైంది. ఈ క్రమంలో ఆయన వెంటనే ఫిర్యాదు చేయగా.. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ అక్రమాలపై ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇక ఈ వ్యవహారమంతా పెద్ద స్కాం అని కలెక్టర్ తేల్చారు. దీంతో ఈ స్కాం చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయనున్నారు.