మార్కెట్లో ప్రస్తుతం మనకు డబ్బును పెట్టుబడిగా పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది సులభ మార్గంలో కచ్చితమైన రిటర్న్స్ వచ్చేలా పెట్టుబడులు పెడుతుంటారు. అలాగే రిస్క్ లేకుండా డబ్బు సురక్షితంగా ఉండే మార్గాలను కూడా ఎంచుకుంటారు. కచ్చితమైన రిటర్న్స్ కావాలని కోరుకుంటుంటారు. అలాంటి వారు కింద తెలిపిన 7 మార్గాల్లో పెట్టుబడులు పెడితే కచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. అలాగే డబ్బు సురక్షితంగా ఉంటుంది.
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
ఇందులో పెట్టిన పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది. ఇలాంటి రిస్క్ ఉండదు. 15 ఏళ్లకు మెచూరిటీ వస్తుంది. డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. ఒక పౌరుడు కేవలం ఒక పీపీఎఫ్ అకౌంట్ను మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. దీని కింద పెట్టే పెట్టుబడికిగాను ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక బ్యాంక్లో పీపీఎఫ్ అకౌంట్ తెరిస్తే దాన్ని ఇతర అకౌంట్లకు మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.
2. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీలు)
ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు అధిక వడ్డీతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. చాలా వరకు బ్యాంకులు చక్కని వడ్డీ రేట్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో నిర్దిష్టమైన కాలం పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఇది కూడా రిస్క్ లేని వ్యవహారం. కచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. కాల వ్యవధి ముగియకున్నా ముందుగా డిపాజిట్ను విత్డ్రా చేయవచ్చు. కాకపోతే ఫైన్ విధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది కూడా చక్కని అవకాశంగా చెప్పవచ్చు.
3. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్స్
ఇందులో 6 నెలల కాల వ్యవధితో డబ్బు పొదుపు చేయవచ్చు. ఆరు నెలలకు ఒకసారి 7.15 శాతం వడ్డీ చెల్లిస్తారు. అయితే ఇందులో వచ్చే ఆదాయంపై కచ్చితంగా పన్ను చెల్లించాలి. కనీసం రూ.1వేయితో పొదుపు చేయవచ్చు. గరిష్టంగా లిమిట్ లేదు. ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజెన్లు అయితే 6 నెలల కన్నా ముందుగానే ప్రత్యేకంగా డబ్బును విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించారు.
4. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్)
వయస్సు 60 ఏళ్లకు పైబడిన వారు ఇందులో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. 7.4 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.15 లక్షల వరకు గరిష్టంగా ఇందులో భాగంగా డిపాజిట్ చేయవచ్చు. ఇన్వెస్టర్లు ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బును డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ గా కూడా అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. 5 ఏళ్లకు మెచూరిటీ వస్తుంది. ఆ తరువాత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. తరువాత కూడా విత్డ్రా చేయకపోతే 3 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
5. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ (పీవోఎంఐఎస్)
ఇందులో డబ్బును గరిష్టంగా 5 ఏళ్ల పాటు పొదుపు చేసుకోవచ్చు. ఏడాదికి 6.6 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.4.50 లక్షల వరకు గరిష్టంగా డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెచూరిటీ గడువు ముగిశాక డబ్బును విత్డ్రా చేయవచ్చు.
6. సుకన్య సమృద్ధి అకౌంట్
ఆడపిల్లలకు 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరిట ఈ అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు. ఏడాదికి 7.6 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేస్తే అప్పుడు ఇందులో పొదుపు చేసిన డబ్బును విత్డ్రా చేయవచ్చు. లేదంటే 21 ఏళ్లకు అకౌంట్ మెచూరిటీ అవుతుంది. అప్పుడు డబ్బును విత్డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఏడాదికి కనీసం రూ.250 వరకు అయినా డిపాజిట్ చేయాలి. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం ఈ పథకం కింద రూ.1.50 లక్షల వరకు గరిష్టంగా పన్ను మినహాయింపు పొందవచ్చు.
7. 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ)
పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న స్కీంలలో ఇదొకటి. దీంట్లో 6.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. 10 ఏళ్లకు పైబడిన వారి పేరిట పెద్దలు డబ్బును పొదుపు చేయవచ్చు.