కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో ఇప్పటికే ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. కరోనా ఎప్పటి వరకు తగ్గుతుందో తెలియదు కానీ.. స్కూళ్లు మాత్రం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరు అయ్యేందుకు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లనే ఉపయోగిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. దాదాపుగా 79 శాతం మంది ఆన్లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్లనే వాడుతుండగా, 17 శాతం మంది ల్యాప్టాప్ లను, మరో 4 శాతం మంది ట్యాబ్లెట్ పీసీలను ఆన్ లైన్ క్లాసులకు ఉపయోగిస్తున్నారని తేలింది.
స్కాలర్షిప్ మేనేజ్మెంట్ పోర్టల్ విద్యాసారథి ఈ మేరకు దేశంలోని 400కు పైగా నగరాల్లో ఉన్న 12 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 10వేల మంది విద్యార్థులను సర్వే చేసింది. దీంతో పై విషయం వెల్లడైంది. ఇక ఆ విద్యార్థులకు చెందిన కుటుంబాల్లో 90 శాతం మంది తల్లిదండ్రులకు ఏడాదికి వచ్చే ఆదాయం రూ.7 లక్షల లోపే ఉన్నట్లు నిర్దారణ అయింది. ఇక మొత్తం విద్యార్థుల్లో 57 శాతం మందికి సరిగ్గా ఇంటర్నెట్ లభించడం లేదు. అలాగే 31 శాతం మంది ఆన్ లైన్ క్లాసులలో దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపారు. మరో 12 శాతం మంది ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు అర్థం కావడం లేదని, సందేహాలు తీర్చుకునే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.
కాగా మొత్తం విద్యార్థుల్లో 59 శాతం మంది ఆన్లైన్ క్లాసులకు వాట్సాప్ వీడియో కాల్ లేదా జూమ్ యాప్ ద్వారా అటెండ్ అవుతుండగా, 30 శాతం మంది విద్యార్థులు తమ స్కూళ్లకు చెందిన సొంత ప్లాట్ఫాం ద్వారా ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. నిత్యం 60 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల్లో 1 నుంచి 4 గంటల వరకు సమయం గడుపుతుండగా, 31 శాతం మంది 4 నుంచి 8 గంటల వరకు, మరో 8 శాతం మంది 8 నుంచి 12 గంటల వరకు ఆ క్లాసుల్లో బిజీగా ఉన్నారు. అయితే చాలా మంది విద్యార్థులకు ఇంటర్నెట్ స్పీడ్ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడతాయో, లేదో చూడాలి.