విజయవాడ: విజయవాడ సమీపంలోని ఒక గోశాలలో పెద్ద మొత్తంలో ఆవులు ఒకే సారి మృతి చెందడం తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో శనివారం 92 ఆవులు మృతి చెందాయి. అస్వస్థతకు గురైన మరి కొన్ని ఆవులకు పశుసంవర్థక శాఖ వైద్యాధికారులు వైద్యసేవలు అందిస్తున్నారు. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్ధాలు కలిశాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన ఆవుల కళేబరాలకు పోస్టుమార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. ఇదే గోశాలలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా గతంలో 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాదవీలత, సబ్ కలెక్టర్ మీషా సింగ్లు గోశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. పరిమితికి మించి ఆవులను గోశాలలో ఉంచారని కలెక్టర్ తెలిపారు. దాణా ఎక్కడ నుండి తెప్పిస్తారు, రాత్రి గోవులకు ఆహారం ఏమి ఇచ్చారు తదితర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గోశాల కార్యదర్శి సాహు తదితరులు అధికారులకు వివరాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి నుండి గోశాలకు పచ్చిగడ్డి తెప్పిస్తుంటామని నిర్వహకులు తెలిపారు. పచ్చిగడ్డి తిన్న ఆవులు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా నిర్వహకుల మద్య విబేధాలు బయటపడ్డాయి. నిర్వహకులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించారని తెలుస్తోంది.