ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. ఈ డోర్ డెలివరీ విషయంలో యువతకు ఆర్ధిక భారం తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
నిరుద్యోగ యువత కోసం 9260 వాహనాలను కొనిచ్చేందుకు సిద్ధపడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. 30 శాతం లోన్ గా ఇస్తారు. మిగిలిన 10 శాతం డబ్బు చెల్లిస్తే వాహనం సొంతమవుతుంది. కొనుగోలుదారుడు పేరిటే బండిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. 30 శాతం లోన్ విషయంలో తిరిగి చెల్లించేందుకు హామీగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఆరేళ్ళ కాలానికి ఈ లోన్ ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మరియు ఈబిసి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాథి పథకం కింద నిరుద్యోగ యువతకు ఈ అవకాశం అందిస్తున్నట్లు తెలిపారు.