చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు అంటుంటారు. సైజుతో సంబంధం లేకుండా చిన్న పాము కాటు వేసినా మనిషి ప్రాణం పోతుంది. అందుకే పెద్దలు అలా చెబుతారు. చాలా మందికి పామును చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతటి గట్టి మనిషైనా సమీపంలో పామును చూస్తే కొంత భయం పడతాడు. అలాంటిది మనిషి కాలు వద్దే విషపూరితమైన నాగుపాము కనపడితే ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది. ఇలాంటి పరిస్థితి ఓ బస్సు డ్రైవర్కు ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వివరాలలోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా జయపురలో ఎప్పటిలాగే ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ ఓ డ్రైవర్ పోతున్నాడు. అయితే ఓ చోట బస్సును స్లో చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బస్సు బ్రేక్ మీద ఆ డ్రైవర్ కాలు పెట్టబోయాడు. అనుకోకుండా బ్రేకు వద్ద చూడగా ఆరు అడుగులు నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో డ్రైవర్కు గుండె ఆగిపోయిందేమో అనిపించింది. వెంటనే తన కాలును ఆ డ్రైవర్ వెనక్కి తీసుకున్నాడు. త్రుటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఆపై బస్సులో ప్రయాణికులను కూడా దింపేశారు. బస్సులో పాము దూరిన విషయాన్ని తెలుసుకున్న ప్రయాణికులంతా హడలిపోయారు.
లక్కీ డ్రైవర్
ఇక వారిని డ్రైవర్, కండక్టర్ సముదాయించారు. బస్సు డ్రైవర్ సీటు వద్ద ఉన్న పామును ఓ కర్ర సాయంతో తీసి బయట పడేశారు. దీంతో అప్పటి వరకు భయపడ్డ ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఆ డ్రైవర్ను అదృష్టవంతుడిగా కొనియాడుతున్నారు. ఏ మాత్రం కాటు వేసినా అది పట్టించుకోకపోయి ఉంటే, పెను ప్రమాదం జరిగేదని పేర్కొంటున్నారు.