సాంకేతిక లోపాల వలన ప్రాణాలుపోతూ ఉండడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలానే లిఫ్ట్లోని సాంకేతిక లోపం వలన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంకా లిఫ్ట్ రాక ముందే లిఫ్ట్ డోర్లు తెరుచుకోవడంతో ఓ అధికారిణి అందులో పడిపోయి చనిపోయింది. తిరుపతిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
వాసంతి అనే మహిళ నెల్లూరు జిల్లాలో గల సతీశ్ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో(షార్) లో అధికారిణిగా పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తన నివాసాన్ని తిరుపతికి మార్చుకున్నారు. ఓ అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్థులో ఆమె మరియు ఆమె కూతురు అద్దెకు ఉంటున్నారు. అయితే, వాసంతి బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గరకు వచ్చారు. ఏదో సాంకేతిక లోపం వలన లిఫ్ట్ రాకముందే డోర్లు తెరుచుకున్నాయి. లిఫ్ట్ వచ్చి ఆగింది అన్న ఆలోచనతో లోపలికి అడుగులు వేయడంతో ఆమె కిందపడి అక్కడికక్కడే మరణించింది.
లిఫ్ట్ సరిగా పని చేయడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఓనర్ పట్టించుకోలేదని ఆమె భర్త సురేంద్ర రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాసంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ ప్రారంభించారు.