చిన్న వయసులో పెన్ను పట్టుకోవాల్సిన చేతితో గన్ పట్టుకున్నాడు. ఒక చిన్న తగాదాకే తోటి విద్యార్థి మీద కక్ష పెంచుకున్నాడు. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియని ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం పిల్లలు అందరూ నూతన సంవత్సర వేడుకలతో సంతోషంగా గడుపుతూ ఉండగా బులంద్షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థి మాత్రం తన తోటి విద్యార్థిపై పగతో రగిలిపోయాడు. క్లాస్ రూంలో జరిగిన ఒక చిన్న తగాదాకే అతడి ప్రాణం తీసాడు. తాను వేసుకున్న పథకం ప్రకారం తన క్లాస్మేట్ను కాల్చి చంపేశాడు.
ఆ బాలుడుపై ఏకంగా మూడు సార్లు కాల్పులు జరిపాడట. ఏకంగా తరగతి గదిలోకి తుపాకీతో కాల్పులు జరపడం అక్కడ ఆందోళన రేపింది. ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే అని పోలీసులు చెబుతున్నారు. కేవలం క్లాస్ రూమ్ లోని సీటుకోసం నిన్న ఆ ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కసి పెంచుకుని నిందితుడు పాఠశాలకు తన మామయ్య తుపాకీని తీసుకెళ్లి బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆ విద్యార్ధి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అంతేకాదు పోలీసులను కూడా విస్మయపర్చిన విషయం ఏమిటంటే నిందితుడి బ్యాగులో మరో నాటు తుపాకీ కూడా ఉందట . సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెబుతున్నా దాని ప్రకారం సైన్యంలో పనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్డ్ తుపాకీని తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడనిఒడిగట్టినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ స్కూల్కు వెళ్లి నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వినియోగించిన తుపాకీని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.