అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు.
బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి బంగారం తరలింపులో లోపలున్న మాట వాస్తవమేనన్నారు. పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్నప్పుడు ముందు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకు, టిటిడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని సుబ్రహ్మణ్యం హితవు పలికారు. శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
అలాగే సమీక్షలు నిర్వహిస్తే టిడిపి చేస్తోన్న విమర్శలపై కూడా సుబ్రహ్మణ్యం స్పదించారు. సిఎస్ గా శాఖల సమీక్షలు నిర్వహించడంలో తప్పేముందని సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఉన్నందున నేతలు నిబంధనల మేరకే నడుచుకోవాలని సుబ్రహ్మణ్యం సూచించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఎన్నికల వేళ భారీ మొత్తంలో బంగారం పట్టుబడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని టిటిడికి అప్పగించారు. కానీ దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో సిఎస్ సుబ్రహ్మణ్యం విచారణ నిమిత్తం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేడు ఈ కమిటీ సిఎస్కు నివేదిక అందజేసింది.