Mother: తన కడుపున పుట్టిన బిడ్డ చనిపోయాడు అని తెలిస్తే ఏ తల్లికైనా ఆ బాధ వర్ణనాతీతం. ఎంచేసైనా తన బిడ్డను బ్రతికించుకోవాలి అనుకుంటుంది ఆ తల్లి. తాజాగా ఇటువంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమాయకపు తల్లీ తన కొడుకు బ్రతికే ఉన్నాడు అనుకుని చేసిన సేవలు అన్ని ఇన్ని కాదు. ఎంతో ఆశగా తన కొడుకుకి మెలకువ వస్తుంది అని ఎంతగానో నిరీక్షించింది. వివరాలలోకి వెళితే….
ఇటీవల కరోనా కారణంగా వలసగా మేఘాలయకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్ర లోని ముంబైకి వచ్చింది. ప్రస్తుతం ఆ కుటుంబం ముంబై నగరంలోని కలీనా ప్రాంతంలో ఉంటోంది. గత కొద్దీ కాలంగా ఓ 70 ఏళ్ల తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ ప్రాంతంలోనే ఉంటోంది. ఆమె చిన్న కొడుకు కి 42 ఏళ్ళు. బుధవారం సాయంత్రం ఆమె చిన్న కొడుకు బాత్రూంలో కాలు జారి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం తెలియక అతడి తల్లి తన కొడుకుని అతి కష్టం మీద బాత్రూంలో నుంచి ఇంట్లోకి తీసుకువచ్చి మంచం మీద పడుకోపెట్టి అతడి తలకు తగిలిన గాయానికి పసుపు పెట్టింది. ఇంకొక విషయం ఏమిటంటే ఆమె పెద్దకొడుకు కూడా అనారోగ్యంతో చాలా కాలంగా మంచం మీదే ఉన్నాడు. తన చిన్నకొడుకుని పాడుకోపెట్టిన మంచం పక్కనే ఆమె కూడా పడుకుంది.
మధ్యలో మెలకువ వచ్చి ఆకలేస్తుంది అంటాడేమో తన చిన్నకొడుకు అని ఆహరం, మంచినీళ్లు ఆమె పక్కనే పెట్టుకుంది. రాత్రంతా అతడి వైపే చూస్తూ ఉండిపోయింది. తెల్లారినా ఇంకా కొడుకు లేవకపోవడంతో బందువులకు ఫోన్ చేసింది. వెంటనే ఆమె బంధువులు పోలీసులకు, అంబులెన్సు కి ఫోన్ చేసి పిలిపించగా ఆమె కొడుకు మరణించినట్లు వారు నిర్దారించారు. ఇక దీనితో ఆమె బాధకు అంతులేకుండా పోయింది.