హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి స్వాదీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లో ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ) మగళవారం నివేదికను ఇచ్చింది.
దాదాపు 40 హార్డ్ డిస్కుల్లోని డేటాను ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేయనున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటి గ్రిడ్స్ సంస్థ వద్ద ఉందనే ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంస్థపై సోదాలు జరిపి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు.
మరోవైపు ఐటి గ్రిడ్స్ ఎండి ఆచూకీ ఇంత వరకూ లభ్యం కాలేదు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఇప్పటికే మూడు సార్లు అశోక్కు నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదు.