వాఘా : మూడు రోజులు పాటు పాక్ కష్టడీలో ఉన్న భారత్ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను నేడు భారత్కు అప్పగించారు. నేటి రాత్రి 9గంటల ప్రాంతంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వాఘా వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్స్ ప్రభాకర్, కపూర్లకు అభినందన్ వర్థమాన్నుపాక్ అర్మీ అధికారులు అప్పగించారు.
వాఘా వద్ద వర్థమాన్ తల్లిదండ్రులు శోభా వర్థమాన్, ఎయిర్ మార్షల్ ఎస్ వర్థమాన్, భారత వాయుసేన అధికారులు, సిబ్బంది, పెద్ద ఎత్తున ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రధాన మంత్రి మోది ఆదేశాల మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ సరిహద్దు వాఘా వద్దకు చేరుకుని స్వాగత కార్యక్రమాలను పర్యవేక్షించారు.
పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సిఆర్పిఎఫ్ జవానులు అసువులు బాసిన నేఫధ్యంలో ఆయిదు రోజుల క్రితం భారత వైమానిక దళం మెరుపుదాడి చేసి పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా పాక్ వైమానిక దళం భారత్ సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది.
వైమానిక దాడుల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాక్ చర్యలను భారత్తో సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
భారత్ వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్థమాన్ను సురక్షితంగా అప్పగించాలని భారత్ హుకుం జారీ చేసింది. అగ్రరాజ్యం అమెరికా సైతం పాక్కు హెచ్చరిక జారీ చేయడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేకపోతు గాంభీర్యం వదిలి వింగ్ కమాండర్ను భారత్కు అప్పగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
బుధవారం పాక్ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన సందర్భంలో భారత్ ఫైటర్ విమానాలు వాటితో తలపడ్డాయి. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ 21తో ఒక పాక్ 16 విమానం వెంట పడ్డాడు. ఆర్ 73 మిస్సైల్ను ప్రయోగించాడు. దానితో ఎఫ్ 16 కూలిపోయింది. అదే సమయంలో దానికి రక్షణగా ఉన్న ఇతర ఎఫ్ 16 విమానాలలో ఒకటి మిగ్పై మిస్సైల్ ప్రయోగించడంతో అభినందన్ వర్థమాన్ విమానం కూడా కూలింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పారాచూట్ సహయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పడిపోయాడు. పాక్ సైనికులు అతన్ని బంధించారు.
Photo courtesy: DNA India