న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల కరోనా వైరస్ కేసుల సంఖ్య 90,927కు చేరింది. 24 గంటల్లో 124 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,872కు చేరింది.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు కనబడుతోంది.
గత 24 గంటల్లో 4,987 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు దేశంలో ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో ఇదే గరిష్ఠం. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 90,927కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 34,109 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 53,946 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల సంఖ్యలో భారత్..చైనాను మించిపోయింది.
ఇక దేశంలో మహారాష్ట్ర అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్ రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి మహారాష్ట్రను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు మహారాష్ట్ర లో 30,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,135 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,606 కరోనా కేసులు, 67 మరణాలు సంభవించాయి. అటు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో 9,333 కేసులు నమోదు కాగా, 129 మంది మృతి చెందారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 2,380 కేసులు నమోదు కాగా, 50 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1509 కేసులు నమోదు కాగా 34 మంది మృతి చెందారు.