టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అనంతరం… “నెక్ట్స్ ఎవరు” అనేచర్చ రాజకీయావర్గాల్లో సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జగన్ ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుంది… అంటే కొందరు మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి కూడా! ఇది ఇక్కడితో ఎలాగూ ఆగేది కాదని, వైకాపా నేతల స్టేట్ మెంట్స్ తోనే అర్ధమయ్యింది. ఈ క్రమంలో ఊహలకు అందకుండా సాగుతున్న ఈ వ్యవహారాల్లో… నెక్స్ట్ ఒక మాజీ మంత్రి కొడుకు పేరు అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.
అచ్చెన్నాయుడు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా పనిసిన పితాని సత్యనారాయణ కొడుకే నెక్స్ట్ అని తెలుస్తుంది! ఈ క్రమంలో పితాని సత్యనారాయణ కుమారుడిని ఏసీబీ అరెస్ట్ చేయబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో పితాని మైకుల ముందుకు వచ్చారు… ఈ ఆరోపణలను ఖండించారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తికాలం మంత్రిగా పనిచేయని పితాని వివాదాలకు దూరంగా ఉంటున్నారనే కామెంట్ ఉంది. ఆయన నిర్వహించిన శాఖల్లో ఆరోపణలు, వివాదాలు పెద్దగా లేనప్పటికీ కావాలని కొందరు పితానిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వర్గం ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో పితాని ప్రమేయం ఎక్కడా బయట పడకపోవడంతో ఆయన కుమారుడిని టార్గెట్ చేశారనే ప్రచారం ఉధృతమైంది. అయితే… నిప్పు లేకుండా పొగరాదు అనే మాటదృష్ట్యా.. కొందరు పుత్రరత్నాలు ఇలాంటి పనుల్లో దూకుడుగా ప్రవర్తించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మైకందుకున్న పితాని… ప్రతిపక్షం నోరు నొక్కేసి పాలించాలని అధికారపక్షం భావిస్తోందనీ ఆరోపించడం మొదలుపెట్టారు. నిజంగా పితాని కానీ, ఆయన పుత్రరత్నం కానీ ఎటువంటి అవినీతికీ పాల్పడన్ని పక్షంలో… ఇంత హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ… ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన పని ఏమిటనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా… అచ్చెన్న అరెస్టు మాజీ మంత్రుల్లో పెద్ద గుబులే రేపిందన్ని అనుకోవాలి!