(తిరుపతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరఢా జులిపిస్తోంది. రాష్ట్రంలో మరో అవినీతి అధికారి అక్రమాస్తులపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నాయనే ఆరోపణపై కాకినాడ ఎపిఎస్పి అసిస్టెంట్ కమాండెంట్ శంకర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
తిరుపతిలోని ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. శంకర్ అక్రమంగా స్థిర చరాస్తులు ఆర్జించారని ఏసీబీకి సమాచారం అందింది. ఈ సమాచారంతో తిరుచానూరు, సోమల, పలమనేరు, బైరెడ్డిపల్లి, రాజంపేట, తాడిపత్రి, హైదరాబాద్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం మినికిలో ఉన్న 50 ఎకరాల పౌల్ట్రీ ఫామ్ పై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. నేడు ఏకకాలంలో 13 ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయని సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. శంకర్ అక్రమాస్తుల విలువ సుమారు 4 కోట్లకు పైగా ఉంటుందని ప్రాధమిక అంచనగా ఆయన తెలిపారు.
గత నెలలోనే కర్నూలు జిల్లా మోటర్ వేహికల్ ఇన్స్ పెక్టర్ (ఎంవిఐ) శివప్రసాద్ నివాసంలో తనిఖీలు జరిపి పెద్ద ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు. దాదాపు 8కోట్లకు పైగా ఆస్తులను, బంగారం, వెండి ఆభరణాలతో పాటు యూగాండా దేశంలోని బ్యాంక్ అకౌంట్ను ఏసిబీ అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఏసిబీ అధికారులు అక్రమార్జన చేసిన అధికారుల నివాసాలపై ఇలా తనిఖీలు నిర్వహిస్తుండంటో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.