మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్న విషయం తెల్సిందే. ఖైదీ నెం 150 తర్వాత చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చేసాడు. ఆ సినిమా ఫలితం సంగతి పక్కనపెడితే దాంతో తనకు బోలెడంత సంతృప్తి దక్కిందని పలు సందర్భాల్లో అన్నాడు చిరు.
ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నాడు. కొరటాల శివ 2018లో విడుదలైన భరత్ అనే నేను తర్వాత మరో సినిమా చేసింది లేదు. అప్పటినుండి చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నాడు శివ. ఆచార్య మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలో మొదలైంది. అయితే మార్చ్ లో కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపివేసిన మొదటి సినిమా ఆచార్య.
చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. షూటింగ్ ను నిలిపివేసే సమయానికి దాదాపు 35 శాతం పూర్తయింది. అయితే జూన్ లో తిరిగి ఆచార్య షూట్ ను మొదలుపెట్టాలని అనుకున్నాడు చిరు. ఇందుకు సంబంధించిన పెర్మిషన్స్ కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసాడు కూడా. అయితే రెండు రాష్ట్రాల్లో కేసులు బాగా పెరిగిపోవడంతో షూటింగ్ ఆలోచనను విరమించుకున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు కొరటాల శివ.
రీసెంట్ గా చిరంజీవిని కలిసి శివ ఇదే విషయమై చర్చించాడు కూడా. నవంబర్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టి నాలుగైదు నెలల్లో జెట్ స్పీడ్ లో షూట్ ను పూర్తి చేయాలన్నది కొరటాల శివ ప్లాన్. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆచార్య విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నటించనుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.