టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కందుకూరు లో రోడ్లు కిక్కిరిసిపోయిన నేపథ్యంలో సభలో అపస్తృతి చోటుచేసుకుంది. కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు రోడ్డు పక్కనే ఉన్న గుండం కట్ల అవుట్ లెట్ కాలువలో పడిపోయారు. వారిలో కొందరు కార్యకర్తలు స్పృహతప్పారు. వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురు కార్యకర్తలు మృతి చెందారు. మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కొండపి ఎమ్మెల్యే స్వామిని ఆసుపత్రికి పంపారు. ఇది బాధాకరమైన ఘటన అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించాలని నేతలను ఆదేశించారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, వారు క్షేమంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. బాధితుల పరిస్థితి తెలుసుకున్న తర్వాతే ప్రసంగిస్తానని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ప్రసంగించకుండానే ఆసుపత్రికి వెళ్లి కార్యకర్తలను పరామర్సించారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించిన చంద్రబాబు.. బాధితులు కోలుకునే వరకూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ తరపున మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తామనీ, బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామని చంద్రబాబు తెలిపారు.
మృతి చెందిన వారు గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం కు చెందిన చిన కొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారిపాలెంకు చెందిన కాకుమాను రాజా, ఉలవపాడు మండలం ఆత్మకూరు కు చెందిన దేవినేని రవీంద్రబాబు, అదే మండలం ఒరుగుసేనుపాలెం కు చెందిన యాటగిరి విజయ, కందుకూరు మండలం కొండముడును పాలెంకు చెందిన కలవకూరి యానాదిగా గుర్తించారు.