(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సినీ నటుడు ఆలీ..ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రిందటే సినీ పరిశ్రమకు అడుగు పెట్టారు. సినిమాల్లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కమీడియన్గా, హీరోగా అక్కడక్కడా మెరిశాడు. కానీ రాజకీయంగా ఎందుకో మెరవలేకపోతున్నాడు. దశాబ్దం క్రిందటే తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి అసెంబ్లీ స్థానం ఆశించినప్పటికీ వరసగా రెండు ఎన్నికల్లోనూ చంద్రబాబు కరుణించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేసి గెలిచేయాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందే జగన్కు జై కొట్టారు. కానీ జగన్ కూడా వరమివ్వలేదు. దీంతో చేసేది ఏమీ లేక మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఆయన సీఎం జగన్మోహనరెడ్డికి ఓ గోళీ వేశారు. ఆ గోళీ పని చేస్తుందా? లేదా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
రంగుల చొక్కాతో జగన్ వద్దకు..ఇదే ఆలీ వేసిన గోళీ..!
రాజకీయం అంటే వైకుంఠ పాళి. అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ అంటే ఆదో రాజకీయ కేళీ. దానిలో ఆలీ దూరి ఎన్ని గోళీలు వేసినా జగన్ దగ్గర పని చేయవు. అయితే ఆలీ ఇది తెలుసుకున్నాడో లేదో కానీ ఈ రోజు మరో గోలీ వేశారు. వైసీపీ రంగులు ఉన్న చొక్కాను ధరించి జగన్ దగ్గరకు ఓ పూల మొక్కను తీసుకువెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చానంటూ పైకి బిల్డప్ ఇచ్చాడు. కానీ తన మనసులోని మాటను జగన్ దగ్గర చెప్పకే చెప్పాడనీ వైసీపీ వర్గాల ద్వారా సమాచారం. సీఎం జగన్మోహనరెడ్డి అనేక కార్పోరేషన్ పదవులను భర్తీ చేయడానికి పార్టీలో అంతర్గత సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో దాదాపు 60 నుండి 70 వరకూ వివిధ నామినెటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. దీనిలోనే సినీ రంగానికి చెందిన పదవులు, మైనార్టీ రంగానికి చెందిన పదవులు కూడా ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో ఆరితేరిన ఆలీ ఏదో ఒకటి తనకు ఇవ్వాలని పట్టుబడుతూ కూర్చున్నారుట.
పృధ్వి కొట్టేశాడు.. ఆ ఛాన్స్
నిజానికి వైసీపీకి సినీ రంగం నుంచి అందుతున్న మద్దతు తక్కువగానే ఉంటుంది. కానీ 2019 ఎన్నికలకు ముందు మాత్రం సినీ రంగం నుంచి పృధ్వి, ఆలీ, మోహన్బాబు వంటి అనేక నటులు జగన్ కలిసి జై కొట్టారు. వాళ్ళలో మోహన్ బాబు సైలెంట్ అయిపోయి బిజెపికి దగ్గర అవుతుండగా పృధ్వి అనూహ్యంగా ఎస్విబిసి చైర్మన్గా మారి మళ్లీ వివాదాల్లో ఇరుక్కొని ఇంటికి పరిమితం అయ్యాడు. ఆలీ మాత్రం ఏ పదవి లేకుండా, ఏ రాజకీయ అలికిడి లేకుండా సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు సినీ రంగం నుండి తనకు ఏదైనా పదవి కావాలంటూ గడచిన మూడు నెలలుగా జగన్ చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే ఆయన ఈ మూడు నెలల వ్యవధిలో వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని రెండు సార్లు కలిసి తాజాగా వారి సూచనలతో ఈ రోజు జగన్ను కలిసినట్లు తెలుస్తోంది. మరి ఆలీ కోరికను జగన్ నెరవేరుస్తారో? లేదో? ఏదో. ఒక పదవి పట్టుకోవాలి, పదవి దక్కించుకోవాలన్న ఆలీ కోరిక నెరవేరుతుందా? లేదా అనేది జగన్ మనసులో ఏముంది? అనేది వేచి చూడాల్సిందే.