దివంగత ముఖ్యమంత్రి, నాటసార్వభౌమ నందమూరి తారక రామరావు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన ముద్రవేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల సమయంలోనూ టీడీపీ సర్కిల్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడుతూనే ఉంది. గతంలో జరిగిన పలు ఎన్నికల సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనలేదు.
జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుభాషిని హైదరాబాద్ కూకట్పల్లి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. దూరంగానే ఉన్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. అయితే పలు సందర్భాలలో రాజకీయాలకు తన వయసు సరిపోదనీ, ప్రస్తుతం సినీరంగంలో బిజీగా ఉన్నాననీ. తన తాత స్థాపించిన పార్టీ టీడీపీ క్షేమమే కోరుకుంటాననీ జూనియర్ వెల్లడించారు. టీడీపీకి దూరం అవుతున్నారని అప్పట్లో వచ్చిన ప్రచారాన్ని మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొట్టిపారేశారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగ్రేటం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తునే ఉన్నారు.
ఇప్పుడు తాజాగా ఏపి రాజకీయాల్లో ఓ ఫ్లెక్సీ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రాబోయే కాలానికి కాబోయే సీఎం.2024 నెక్స్ట్ ఏపీ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, స్థానిక టీడీపీ నాయకుల ఫోటోలు ఉండటం గమనార్హం. ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.