తమిళనాట ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సినీ నటి కుష్బూ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
సీఎం అభ్యర్ధిత్వం విషయంలో అన్నా డీఎంకే లో నెలకొన్న సంక్షోభం సమసిపోయిన విషయం తెలిసిందే. సీఎం పలని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలుగా విడిపోయి గొడవపడి తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సినీనటి ఖుష్బూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు మధ్యాహ్నం బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన కుష్బూ తొలుత డిఎంకెలో చేరారు. తరువాత 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమెకు పార్టీ.. జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది.
కుష్బూ బిజెపిలో చేరుతారని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారాన్ని అప్పుడు ఆమె కొట్టిపారేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆమె పార్టీ వైఖరికి భిన్నంగా ప్రశంసించడం పార్టీలో వివాదాస్పదం అయ్యింది. అప్పటి నుండే ఖుష్బు పై రోమర్స్ వచ్చాయి. ఎన్నికల వేళ కుష్బూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కుష్బూ పార్టీకి షాక్ ఇచ్చారు.