ప్రభాస్ – జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘రాధే శ్యామ్’ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాగా ఈ సినిమా తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా మిగిలి ఉన్న ఒక్క షెడ్యూల్ ని త్వరలో ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ లోపు ‘రాధే శ్యామ్’ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ నెక్స్ట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు. ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్తో త్రీడీ ఫార్మాట్ లో రూపొందనున్న ఈ సినిమాని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి భారీ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 11, 2022లో ఆదిపురుష్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ సినిమా కంటే ముందే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ప్రభాస్ నటించాల్సి ఉండగా ఆ సినిమాకి ఇంకా కొంత ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తుండటం తో లేట్ చేయకుండా ప్రభాస్ ఆదిపురుష్ ని మొదలు పెట్టాడు. అయితే తాజాగా వచ్చిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ తో కే.జీ.ఎఫ్ డైరెక్టర్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో ఒక భారి యాక్షన్స్ మూవీ తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
కాని ప్రభాస్ వరసగా మూడు భారీ ప్రాజెక్ట్స్ తో కమిటయి ఉండటంతో ఈ కాంబినేషన్ లో సినిమా గురించి అంత క్లారిటీ లేదు. అయితే ‘రాధే శ్యామ్’ డిసెంబర్ వరకు కంప్లీట్ అవబోతుంది. ఆదిపురుష్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో సినిమా కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలిస్తోంది. ఇక కే.జీ.ఎఫ్ చాప్టర్ 2 తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా చేస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.