ఢిల్లీ, జనవరి 26: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే మరో సారి నిరాహార దీక్షకు దిగారు. లోక్పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు.
‘లోక్పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇంత వరకూ లోక్పాల్, లోకాయుక్తలను నియమించలేదు. అసలు ఏ పార్టీ దీని గురించి పట్టించుకోవడం లేదు’ అని హజరే అన్నారు.
లోక్పాల్, లోకాయుక్త ఏర్పాటు చేసే వరకూ నిరాహర దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
‘నరేంద్ర మోదిపై నాకు విశ్వాసం పోయింది. ప్రజలను మోసం చేస్తారు, ఎన్నో హామీలు ఇచ్చారు, రైతులకు సంబంధించి స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామన్నారు’
అధికారంలోకి రాగానే లోక్పాల్, లోకాయుక్త చట్టాన్ని అమలు చేస్తామన్నారు, వాటిలో ఏదీ కూడా అమలు చేయలేదని హజరే అన్నారు. ఇప్పటికి 35లేఖలు రాసినా సమాధానం లేదని హజరే చెప్పారు.
లోక్పాల్, లోకాయుక్త నియామకాలపై హజరే గతంలోనూ నిరాహార దీక్ష చేపట్టారు.