సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కోసం బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 20వ తేదీ తరువాత ఫ్రాంచైజీలు దుబాయ్ వెళ్లనున్నాయి. మరోవైపు ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. ఇక టోర్నీని దుబాయ్లో నిర్వహించేందుకు గాను ఇప్పటికే బీసీసీఐ కేంద్రం నుంచి అనుమతి కూడా పొందింది. అయితే ఐపీఎల్ను దుబాయ్లో కాకుండా ఇండియాలోనే నిర్వహించాలని కోరుతూ ఓ న్యాయవాది తాజాగా బాంబే హై కోర్టులో పిటిషన్ వేశారు.
అభిషేక్ లాగూ అనే న్యాయవాది బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐపీఎల్ వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, భారత్కు కూడా ఎంతో ఆదాయం వస్తుందని.. అందువల్ల టోర్నీని దుబాయ్లో కాకుండా ఇండియానే నిర్వహించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. కరోనా ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుని టోర్నీని నిర్వహించవచ్చని, కేంద్రం ఇప్పటికే ఆ దిశగా స్టేడియాలకు ఆంక్షల సడలింపులు కూడా ఇచ్చిందని అన్నారు. అందువల్ల టోర్నీని దుబాయ్లో కాకుండా భారత్లోనే నిర్వహించాలని కోరారు.
కాగా అభిషేక్ లాగూ పిటిషన్ను చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ రేవతి మొహితె దెరెలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఇక ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ను కూడా బీసీసీఐ మంగళవారమే ప్రకటించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జియో, టాటా సన్స్ ఇందుకు గాను పోటీ పడుతున్నాయని సమాచారం.