Advocate Murder Case : హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు తొలి సారిగా స్పందించారు. మంథనిలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన న్యాయవాది దంపతుల హత్యపై స్పందిస్తూ పోలీసుల కన్నా మీడియానే అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఒక బీసీ నాయకుడు జడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా చేస్తున్న అసత్య ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారని విమర్శించారు. పోలీసులను విచారణ చేయనిస్తారా లేక శ్రీధర్ బాబు చేస్తారా అని మధు ప్రశ్నించారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేయాల్సిన దర్యాప్తును కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయని మండిపడ్డారు. హత్యలు జరిగిన తరువాత తాను మంథనిలో ఉండటం లేదనీ, ముఖం చాటేశానని కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు అసత్యప్రచారం చేశాయన్నారు. తాను ఎక్కడకు వెళ్లలేదనీ, ముఖం చాటేయ్యలేదని అన్నారు. తాను సీఎం కేసిఆర్, మంత్రి కెటిఆర్ వద్దకు వెళ్లలేదనీ, కనీసం వారి అపాయింట్ మెంట్ కూడా అడగలేదని అన్నారు. హత్య జరిగిన రోజు నుండి ఇవాల్టి వరకు మంథని నియోజకవర్గంలోనే ఉన్నాననీ, నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలకు తొత్తుగా మారి అమ్ముడుపోయిన కొన్ని మీడియా సంస్థలు, ఛానళ్లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. పోలీసుల విచారణ పూర్తి అయిన తరువాత హైదరాబాదులో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుట్రలను తిప్పికొడతానని మధు పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?