Telangana : తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్లకు రక్షణ కరువైందా? అన్న భయాందోళనలు న్యాయవాదులను కమ్మేస్తున్నాయి.ఇక్కడ న్యాయవాద వృత్తి కత్తిమీద సాముగా ఉందని వారు భీతిల్లుతున్నారు.వరుసపెట్టి న్యాయవాదులపై జరుగుతున్న దాడులు వారిని కలవరపరుస్తున్నాయి.
నిన్నగాక మొన్న హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతులను దారుణంగా హత్య చేసిన ఉదంతం ఇంకా మరుగున పడకముందే భూమి వివాదానికి సంబంధించి కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు … కేసు ఓడిపోవటానికి లాయరే కారణమని భావించి అతడిపై హత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే అదృష్టం బాగుండి ఆ న్యాయవాది ప్రాణాలతో బయటపడ్డాడు
అసలేం జరిగిందంటే?
హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 7 లో ఉండే హైకోర్టు న్యాయవాది జస్వంత్ ఒకనభూ వివాదానికి సంబంధించిన కేసు వాదించారు. ఇటీవలే ఈ కేసులో కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము ఓడిపోయామని కక్షిదారులు భావించారు. ఫలితంగా చాలా పెద్ద ఎత్తున నష్టపోయామని వారు కోపంతో రగిలిపోయారు.
దీంతో న్యాయవాదిపై కక్షకట్టిన కక్షిదారులు ఈనెల 17వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి అతనితో గొడవకు దిగారు. ఈక్రమంలో న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు. వారిలో కొందరు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టటంతో పాటు కత్తితో పొడించేందుకు సిద్ధమయ్యారు.అయితే ఈ తతంగాన్నంతా చూస్తున్న స్ధానికులు కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించటం చూసి వెనక్కు తగ్గారు. కొందరు 100 కు ఫోన్ చేయటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటం, సంబంధిత ఎస్సైకు కాకుండా మరోకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించటం పలు అనుమానాలకు తావిస్తోంది.వామనరావు హత్యకేసులో మాదిరిగానే జస్వంత్ పై దాడి ఉదంతంలో కూడా పలుకుబడి గల రాజకీయ నాయకులు ఉన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.వామనరావు హత్యకేసులో బడా రాజకీయ నేతల పేర్లు వినిపిస్తూ ఉండటం తెలిసిందే.