ఒకరు ఇద్దరయ్యారు.., ఇద్దరు ముగ్గురయ్యారు.., ఆ ముగ్గురు మరో ఇద్దరిని కలిశారు. మొత్తానికి మానవ సంబంధాలకు పొగ పెట్టారు. మానవత్వానికి మంటగట్టారు. ఆ కథ ఏంటో చూడండి..!
ఇది ఒక మాయలేడి క్రైమ్ కథ…! ఒక తప్పు చేసి… దాన్ని తప్పించుకునేందుకు ఒకరిని చంపి.., దాన్ని తప్పించుకునేందుకు మరొకరిపైకి నెట్టి.., చివరికి తాను కటకటాలకు చిక్కిన ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీ. డబ్బు, సుఖం అనే యావ మధ్య నానాటికీ పాడి ఎక్కిపోతున్న మానవీయ బంధాల్ని.., కుటుంబ విలువల్ని.. మేల్కొలిపే ఒక జరిగిన కథ. గుంటూరు జిల్లా పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం..!!
ఆమె కథ సింపుల్ గా ఇదీ…!
ఒక వివాహమైన స్త్రీ మూర్తి.., పిల్లలు కలిగిన మాతృమూర్తి.., పదేళ్ల కిందటే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త చాలక మరొకరితో అక్రమ సంబంధం. దీంతో తన భర్తతో గొడవలు జరగడంతో స్వగ్రామం పిడుగురాళ్ల వదిలేసి గుంటూరు వచ్చేసి ఒక తోటలో కూలీ చేసుకుంటూ.., నివాసం ఏర్పరుచుకుంది. ఆమె పేరు పఠాన్ నాగూర్ బీ.., భర్త పేరు సైదా అలీ, వీరి మధ్య దూరిన వ్యక్తి పూర్ణచంద్రరావు. పిడుగురాళ్ల నుండి గుంటూరు వచ్చినా నాగూర్ బీ, పూర్ణచంద్రరావు మధ్య ఆ సంబంధం అలాగే కొనసాగింది. (నిజానికి ఈ సంబంధం కోసమే వచ్చేసారు). కొన్ని నెలలు ఈ ఇద్దరి సంబంధం కొనసాగగా… నాగూర్ బీకి ఎందుకో రెండో పెళ్లిపై (మూడో వ్యక్తిపై) మోజు కలిగింది. దీంతో షఫీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ గుంటూరు శివారులో చిన్న హోటల్ పెట్టుకుని నడుపుకుంటున్నారు.
కథలోకి మరో మహిళ…!
ఈ కథ ఇలా సాఫీగా సాగుతుండగా… పూర్ణచంద్రరావుకి నాగూర్ బీ మధ్య చీకటి సంబంధం కొద్దిపాటి ఎడబాటు వచ్చేసింది, పచ్చిగా చెప్పుకోవాలంటే బోరు కొట్టేసింది. కానీ ఆర్ధిక బంధాలున్నాయి. దీంతో మరో మహిళను తనకు పరిచయం చేయాలి అంటూ పూర్ణచంద్రరావు నాగూర్ బీని కోరారు. ప్రియుడు కోరినదే కోరికగా… ఆమె శివ కుమారి అనే ఓ మహిళను పూర్ణచంద్రరావుకి పరిచయం చేసి, వారి మధ్య ఆ సంబంధం కలిగేలా దగ్గరుండి ప్రోత్సహించింది.
చిచ్చు రగిలింది ఇలా…!
శివ కుమారి, పూర్ణల బంధం బలపడుతుండగా… ఈయన మనసు ఎందుకో మళ్ళీ నాగూర్ బీ పైకి మళ్లింది. ఇది నచ్చని శివకుమారి “ఆమె మరొకరితో ఉంటుంది. మొదటి భర్త, తర్వాత నువ్వు, తర్వాత రెండో భర్త.., ఇప్పుడు మరో వ్యక్తితో సంబంధం. ఇంకా ఎందుకు నువ్వు” అంటూ నూరిపోసింది. దీంతో పూర్ణకి కోపం వచ్చి నాగూర్ బీకి ఫోన్ చేసి తిట్టిపోసాడు. ఇది నచ్చని ఆమె భర్త షఫీ పూర్ణతో గొడవ పెట్టుకున్నాడు,ఇది పెద్దదిగా మారింది. దీంతో పూర్ణాని చంపేయాలని షఫీ స్కెచ్ వేసాడు.
హత్యా..? కిడ్నాప్..? డబ్బు డ్రామా…!!
పూర్ణచంద్రరావుని చంపేయడానికి కిరాయి మనుషులను మాట్లాడే క్రమంలో షఫీకి ఎవరూ దొరకలేదు. కొందరు మాత్రం కిడ్నప్ చేస్తామని, నువ్వే చంపుకోవాలని ముందుకొచ్చారు. ఇక వారితో పనేముంది… తానే పూర్ణని చంపెయ్యాలి అనుకుని షఫీ… “నాగూర్ బీ మీకు ఇవ్వాల్సిన లక్ష ఇచ్చేస్తాను, రండి అంటూ నెమ్మదిగా మాట్లాడాడు. ఇదే సమయంలో నాగూర్ బీ రంగంలోకి దిగి తన భర్త నిన్ను చంపేస్తాడు. ప్లాన్ వేసాడు రావద్దు అని చెప్పి, నేను ఇవ్వాల్సిన లక్ష ఇక ఇవ్వను… లేకపోతే నా భర్తకి నిజం చెప్పేస్తా.., నిన్ను చంపించేస్తా “అంటూ బెదిరించింది. ప్రాణం ముఖ్యం అనుకున్న పూర్ణచంద్రరావు లక్ష వదులుకున్నాడు. సరే అనుకుని ప్రశాంతంగా ఉన్నాడు.
ఇది పెద్ద ట్విష్టు, హత్య ఇలా…!
ఇక అంతా సక్రమమే అనుకున్న తరుణంలో పూర్ణని చంపెయ్యాలి అనుకుంటే తన భార్య నాగూర్ బీ అడ్డుపడింది, ఏదో ఉంది అంటూ అనుమానించిన షఫీ ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు. దీతో నాగూర్ బీ కి కొత్త ఆలోచన వచ్చింది. భర్త లేదు, పూర్ణ కూడా లేకపోతే తాను ఫ్రెష్ గా జీవితం ప్రారంభించవచ్చు…, గతం వదిలేసి ఉండొచ్చు అనుకుంటూ పూర్ణని హత్య చేసేందుకు ముగ్గురితో ఒప్పందం మాట్లాడుకుంది. అందుకు వారికి తనతో బంధాన్ని పంచుతా అంటూ ఎర వేసింది. ఇలా.. “నీకు ఇవ్వాల్సిన లక్ష ఇచ్చేస్తా గుంటూరు వచ్చెయ్ అంటూ పూర్ణచంద్రరావుని పిలిపించి.., మరో ముగ్గురు (కరీముల్లా, బిబి ఆసియా, రాజేష్)తో కలిసి పూర్ణ మెడకు కరెంటు వైరు బిగించి చంపేశారు.
క్రైమ్ తెలివి… ఆధారాలు మార్పు…!
పూర్ణని హతమార్చింది… భర్త షఫీని కూడా జైలుకి పంపించేస్తే ఇక తన కథ సుఖం అనుకుని… హత్య ప్రదేశం వద్ద షఫీకి చెందిన ఆధార కార్డు, కరెంటు బిల్లు, ఓటర్ ఐడీలు వదిలి వెళ్ళింది. ఈ ఘటనపై పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయడంతో డొంక కదిలింది. మొదట షఫీని… ఆయన ద్వారా నాగూర్ బీని అరెస్టు చేసారు. ఆమె చెప్పిన క్రైమ్ స్టోరీ విని,. ఆమె ప్లాన్ విని కంగుతిన్నారు. ఈ మర్డర్ మిస్టరీ మొత్తాన్ని ఈరోజు(సోమవారం) గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు.