Afghanistan: మరణించేందుకు అయినా సిద్ధమే కానీ తాలిబన్లకు ఎప్పటికీ తలవంచేది లేదని అఫ్ఘనిస్థాన్ స్వయం ప్రకటిత అధ్యక్షుడు అమృల్లా సలేహ్ స్పష్టం చేశారు. అఫ్ఘనిస్థాన్ లో అన్ని ప్రావిన్స్ లు తాలిబన్లకు లొంగిపోయినా పంజ్ వీర్ మాత్రం పోరాటమే ఊపిరిగా సమరశంఖం పూరించింది. దీంతో పంజ్ వీర్ ప్రాంతంలో తాలిబన్లకు, ప్రతిఘటన దళాలకు మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. గడచిన 24 గంటల్లో తాలిబన్లు వందలాది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఆప్ఘన్ దిగ్గజ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ నాయకత్వంలోని పంజ్ షీర్ దళాలు తాలిబన్లను తరిమికొట్టేందుకు తీవ్ర పోరాటం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమృల్లా సలేహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ తాలిబన్ల దాడిలో తాను గాయపడితే తన తలకు గురి పెట్టి రెండు రౌండ్ లు కాల్పులు జరపాలని తన గన్ మెన్ లను ఆదేశించారు. తాను మరణానికైనా సిద్ధం కానీ తాలిబన్లకు ఎప్పటికీ తలవంచేది లేదని అమృల్లా స్పష్టం చేశారు.
పంజ్ వీర్ పై తాలిబన్లు తమ దాడిని తీవ్రతరం చేస్తుండగా మానవతా సాయం కోసం పంజ్ వీర్ లోయ నివాసితులు అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. తమ మాన ప్రాణాలు, కనీస హక్కులు కాపాడుకునేందుకు పోరాడుతున్న పంజ్ వీర్ వాసులకు మానవతా దృక్పదంతో సహాయం చేయాలని ఐక్య రాజ్యసమితి సమితికి అమృల్లా సలేహ్ కోరారు. అప్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడుగానూ బాధ్యతలు నిర్వహించిన అమృల్లా సలేహ్..కాబుల్ ను తాలిబన్లు ఆక్రమించిన వెంటనే ఆయన పంజ్ వీర్ లోయకు వెళ్లి అప్ఘన్ హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. పంజ్ వీర్ లోయలోనే ఉంటూ తాలిబన్ల వ్యతిరేక పోరాటం చేస్తూ ప్రపంచ దేశాలకు ఆప్షన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజ్ వీర్ తమ అధీనంలోకి రావడం లేదన్న కక్షతో తాలిబన్లు దాడులు తీవ్ర తరం చేస్తున్నారని అమృల్లా సలేహ్ అన్నారు. లోయలోని మూడు జిల్లాల్లో ఆర్థిక వనరులు, సెల్ ఫోన్ సిగ్నళ్లు నిలిపివేయడంతో మానవ సంక్షోభం ఏర్పడిందని అమృల్లా సలేహ్ ఆందోళన వ్యక్తం చేశారు.