బీసీ పేరు చెప్పి అచ్చెన్నాయుడిని టీడీపీ నేతలు వెనకేసుకొస్తున్న ప్రతిసారీ… ఏపీ ఫైబర్ గ్రిడ్ లో నాటి ఐటీ మంత్రికి సంబందం లేదని నారా లోకేష్ చెబుతున్న ప్రతిసారీ వైకాపా నేతలు, మంత్రులు క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. అచ్చెన్నతో ఇది ఆగేది కాదని, తర్వాత ప్లేస్ లో చాలా మంది ప్రముఖులే ఉన్నారని.. వారంతా నెక్స్ట్ అచ్చెన్నాతో జైలు షేర్ చేసుకోబోతున్నారన్న రేంజ్ లో కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా స్పందించారు ఏపీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్!
తప్పు చేస్తే వదిలేస్తామనుకుంటున్నారా తమ్ముళ్ళూ.. అచ్చెన్న అరెస్ట్ ఆరంభం మాత్రమే అని టీడీపీకి గట్టిగానే చెబుతున్నారు క్రిష్ణదాస్. బీసీల ముసుగులో తప్పించుకుంటామంటే కుదరదని, బీసీలను కరివేపాకులా వాడుకున్న బాబుకు ఇప్పుడు బీసీలు గుర్తుకురావడం, పైగా అవినీతి కేసులో అరెస్టయిన వ్యక్తికి కులాన్ని అంటగట్టడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా.. జగన్ రెడ్డి కి వడ్డీలతో సహా చెల్లిస్తామని, కేడర్ ను ఉత్సాహపరిచే డైలాగులు చెబుతున్న చినబాబు పై స్పందించిన క్రిష్ణదాస్… అసలూ, వడ్డీ అంటూ లోకేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లడుతూ అపుడే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా ఫీలవుతున్నారని.. రేపటి రోజున అవినీతి సొమ్మును వడ్డీలతో సహా కక్కిస్తామని చెబుతున్నారు!
అనంతరం లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై స్పందించిన క్రిష్ణదాస్… మంగళగిరిలో ఓడిన లోకేష్ ఇక జన్మలో గెలవలేడని కూడా జోస్యం చెప్పేశారు. ఇదే క్రమంలో అచ్చెన్నా, చినబాబు అనంతరం అయ్యన్నపాత్రుడిపై మంత్రి స్పందించారు. అంటే… పరోక్షంగా నెక్స్ట్ వరుసలో ఉన్న అన్ని పేర్లూ వరుసగా చెప్పినట్లే అయ్యిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… అచ్చెన్నా ఆరంభం మాత్రమే అని, ఆయనతో గది షేర్ చేసుకునే నెక్స్ట్ వీళ్లే అని ఆన్ లైన్ వేదికగా కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి!